Monday, October 5, 2020

ఏడ వలపేట మచ్చి కేడ సుద్దులు

 జై శ్రీమన్నారాయణ 

రాగం : రేవతి 

సంపుటి : 1, సంకీర్తన : 220 

పాడినవిధానాం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ 


ఏడ వలపేట మచ్చి కేడ సుద్దులు 

ఆడుకొన్నమాటలెల్ల నవి నిజాలా 


తొలుకారు మెఱుపులు తోచి పోవుగాక 

నెలకొని మింటి నవి నిలిచీనా 

పొలతులవలపులు పోలసిపోవుగాక 

కలకాలంబవి కడతేరీనా 


కలలోని సిరులెల్ల కనుకూర్కులేకాక 

మెలకువ చూడ నవి మెరసీనా 

అలివేణుల మేలు ఆసపాటేకాక 

తలపు వేంకటపతి తగిలీనా 


కాంతాకనకాదులు అనాదిగా జీవుణ్ణి మాయామోహితుణ్ణి చేసి అధోగతి పాలు చేస్తున్నాయి. ఇవన్నీ అసత్యాలు! అశాశ్వతాలు! అదే విషయాన్నీ అన్నమయ్య ఈ పాటలో చక్కగా తెలియజేస్తుననాడు! మనం ప్రేమ, వలపు ఆత్మీయత, అనుకునే ఇవన్నీ నిజంగా నిజమైనవా? కాదు, ఎందుకంటే అనంత కాలగమనంలో ఎవరూ ఎవరినీ శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండరు. చనిపోయేటప్పుడు ఏకాకిగా పోవాల్సిందే! కాబట్టి మూన్నాళ్ళ ముచ్చట అయన ఈ భోలోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు అంత వట్టి బూటకాలే కదా! తొలకరి మెరుపులు, ఉరుములు అలా వచ్చి ఒక్కసారిగా గర్జించి వెళ్లిపోతాయి తప్ప వాటివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు! అలాగే భామినులు వలపులు కూడా యవ్వనంలో మురిపించి సత్యాన్ని మరపించేవే తప్ప శాశ్వతాలు కావు! దూరం నుంచి చూస్తే ఎండమావులలో నీరు ఏరులై పారుతుంది కానీ దగ్గరకు వెళ్లి దాహం తీర్చుకుందామనుకుంటే ప్రయోజనం శూన్యం! ఆ విధంగానే నెలతలపై మోహము ఆశకొల్పుతుంది కానీ శాశ్వతానందాన్ని అందివ్వదు! కలలో  కనిపించిన సంపద ఎలా మన చేతికి అందదో, అలాగే కాంతలపై మొహం వల్ల  మేలు చేతికి అందదు సరికదా, అది భగవంతునిపై తలుపును చేర్చనివ్వదు. 



శరణంటి మాతని సంబంధమునజేసి

 జై శ్రీమన్నారాయణ 

రాగం : లలిత 

సంపుటి 2, సంకీర్తన 24

రాసిన వారు : శ్రీ పెద్ద తిరుమలాచార్య 

పాడినవిధానము : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు 


శరణంటి మాతని సంబంధమునజేసి 

మరిగించి మమునేలి మన్నించవే 


సకల వేదములు సంకీర్తనలు చేసి 

ప్రకటించి నినుపాడి పావనుడైన 

అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యులు 

వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ 


నారదాది సనక సనందనాదులవలె 

పేరుబడి నిన్నుపాడి పెద్దలైనట్టి 

ఆ రీతి తాళ్ళపాక అన్నమాచార్యుల 

చేరి ఏలినయట్టి శ్రీ వేంకటనిలయ 


సామవేద సామగాన సప్తస్వరములను 

బాముతో నీసతి నిన్ను పాడినయట్టి 

ఆముకొన్న తాళ్ళపాక అన్నమాచార్యుల 

వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయ 


పెద్ద తిరుమలాచార్యుల వారి సంకీర్తన ఇది, అన్నమయ్య వంశస్థులమై, ఆ మహనీయునితో గల అనుబంధంతో మిమ్ముల్ని శరణు కోరుతున్నాను స్వామీ! సకల వేదసారాన్ని సంకీర్తనలుగా మలచి, నారదసనక సనందనాదుల వలె నీపై సంకీర్తనలు పాడి, సామవేద సామగాన సప్తస్వరములను నీకంకితం చేసిన అన్నమయ్యను చూసైనా మమ్ముల్ని కరుణించు వేంకటనిలయా! అంటూ విన్నపం చేస్తున్నాడు పెద్దతిరుమలయ్య . 

చాటెద నిదియే సత్యము సుండో

 జై శ్రీమన్నారాయణ 

రాగం : శుద్థసావేరి 

సంపుటి 2, సంకీర్తన 164

పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ 



చాటెద నిదియే సత్యము సుండో 

చేటులే దితని సేవించినను 


హారినొల్లని వా రసురులు సుండో 

సురలీతని దాసులు సుండో 

పరమాత్ముడితడే ప్రాణము సుండో 

మరుగక మరచిన మరి లేదికను 


వేదరక్షకుడు విష్ణుడు సుండో 

సోదించె  శుకుడు అచ్చుగ సుండో 

ఆది బ్రహ్మగన్నాతడు సుండో 

ఏదెస వెదకిన ఇతడే ఘనుడు 


ఇహ పర మొసగను ఈతడే సుండో 

వహి నుతించె పార్వతి సుండో 

రహస్య మిదియే రహి శ్రీ వేంకట 

మహీధరంబున మనికై నిలిచె 


అన్నమయ్య శ్రీ వేంకటాద్రిని  అధిరోహించి తాను కనుగొన్న సత్యాన్ని లోకానికంతటికీ ఎలుగెత్తి చాటుతున్నాడు! రెండు చేతులతో మనలందర్ని ఆ కొండపైకి ఆహ్వానిస్తూ ఇదిగో వినండి ఇదియే సత్యము కలియుగ రహస్యాన్ని మీ అందరికీ వెల్లడి చేస్తున్నాను, వేదరక్షకుడైన విష్ణుదేవుడు మనందరికీ ప్రాణాధారుడు ఇహపరాలను అనుగ్రహించేవాడు కలియుగంలో శ్రీ వేంకటాద్రిపై మనకు మనుగడగా  నిలిచి ఉన్నాడు కాబట్టి రండి ఆ దేవుని సేవించండి తరించండి అంటున్నాడు అన్నమయ్య ఆశ్రితజనపాలకుడు , సత్యస్వరూపుడైన శ్రీ వేంకటేశ్వరుణ్ని సేవించి తరిద్దాం 




Friday, September 25, 2020

శరణు వేడెద యజ్ఙసంభవ రామ

 జై శ్రీమన్నారాయణ 

రాగం : హంసానంది 

పాడినవిధానాం : శ్రీమాన్ బాలకృష్ణప్రసాద్ గారు 

సంపుటి 3, సంకీర్తన 155


శరణు వేడెద యజ్ఙసంభవ రామ 

అరసి రక్షించు మమ్ము అయోధ్యరామ 


ధారుణిలో దశరధతనయ రామ 

చేరిన అహల్యను రక్షించిన రామ 

వారిధిబంధన కపివల్లభ రామ 

తారకబ్రహ్మమైన సీతాపతి రామ 


ఆదిత్య కులాంబుధి మృగాంక రామ! హర -

కోదండభంజనము చేకొనిన రామ 

వేదశాస్త్ర పురాణాది  వినుత రామ 

ఆదిగొన్న తాటకసంహార రామ 

 

రావణుని భంజించిన రాఘవ రామ 

వావిరి విభీషణవరద రామ 

సేవ నలమేల్మంగతో శ్రీ వేంకటేశుడవై 

ఈవల  దాసుల నెల్లా నేలినట్టి రామ 


        

Tuesday, September 22, 2020

శరణు శరణు నీకు జగదేక వందిత


జై శ్రీమన్నారాయణ 

సంపుటి 4, సంకీర్తన 276

రాగిరేకు 347

రాగం : ఛాయ 

పాడినవారు : గరిమెళ్ళ అనిలకుమార్ గారు. 


శరణు శరణు నీకు జగదేక వందిత 
కరుణతో మమ్ము నేలు కౌసల్య నందన 

ఘన రణరంగ విక్రమ దశరథ పుత్ర
వినుతామరస్తోమ వీర రాఘవ 
మునులును ఋషులును ముదమునొందిరి నీవు 
జననమందినందుకు జానకీరమణ 

సులభ లక్ష్మనాగ్రజ సూర్యవంశతిలక 
జలధిబంధన విభీషణ వరద 
తలకి అసురులు పాతాళము చొచ్చిరి నీవు
విలువిద్య నేర్చితేనే విజయరామ

రావణాంతక  సర్వ రక్షక నిర్మల భక్త 
పావన దివ్యసాకేత పట్టణ వాస
వేవేలుగ నుతించిరి  వెస హనుమంతాదులు
సేవించిరి  నిన్నుచూచి శ్రీ వేంకటేశ

కొండలలోనెలకొన్న కోనేటిరాయడు వాఁడు

 జై శ్రీమన్నారాయణ 

రాగం : హిందోళం 

పాడినవిధానాం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు 

సంపుటి 1, సంకీర్తన 151


కొండలలోనెలకొన్న కోనేటిరాయడు వాఁడు  

కొండలంతవరములు గుప్పెడు వాఁడు 


కుమ్మరదాసుడైనకురువరతినంబి 

ఇమ్మన్నవరములెల్ల ఇచ్చినవాఁడు  

దొమ్ములు సేసినయట్టి  తొండమాంజక్కురవర్తి 

రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాఁడు 


అచ్చపువేడుకతోడ అనంతాళువారికి 

ముచ్చిలి వెట్టికి  మన్ను మోచినవాఁడు 

మచ్చిక దోలక తిరుమలనంబితోడుత 

నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాఁడు 


కంచిలోన నుండ తిరుకచ్చినంబిమీద కరు-

ణించి తనయెడకు రప్పించినవాఁడు 

యెంచ నెక్కుడైన వేంకటేశుడు మనలకు 

మంచివాడై కరుణ పాలించినవాఁడు 


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరసామివారు కొండలలో  కొలువై ఉండటమే కాదు, కొండలంతవరాలను గుప్పే దొడ్డదొర అని అన్నమయ్య ఈ పాటలో కీర్తిస్తున్నారు. రాజు అర్పించిన బంగారు పూలను వద్దని, మహాభక్తుడైన కురువనంబి (కుమ్మరిదాసు) అర్పించిన బంకమట్టి పూలను స్వీకరించి అనుగ్రహించిన ఉన్నతోన్నతమూర్తి వేంకటేశ్వరుడు!  ఆశ్రితుడైన  తొండమాన్ చక్రవర్తికి శంఖచక్రాలను అనుగ్రహించినవాడు శ్రీనివాసుడు! అనంతాళ్వార్ల  వారి పుష్పకైంకర్యాన్ని స్వీకరించి అనుగ్రహించినవాడు స్వామి! తిరుమలనంబిని బ్రోచినవాడు! భక్తుడైన తిరుకచ్చినంబిని కంచి నుండి తన వద్దకు రప్పించుకున్నవాడు! అట్టి వేంకటేశ్వరుడు భక్తులైన మనందరినీ అపారమైన కరుణతో పాలిస్తున్నాడు అని ఆచార్యులవారు అంటున్నారు. 

 


Sunday, September 13, 2020

గతులన్ని ఖిలమైన కలియుగమందును

 

జై శ్రీమన్నారాయణ 

రాగం : మోహన 

సంపుటి 2, సంకీర్తన 372 

పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణప్రసాద్ & శ్రీ అనిలకుమార్ 


గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి ఈతడే చూపె ఘన గురుదైవము

అన్నమాచార్యుల వారు తనకు శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రభావం భగవద్రామానుజుల వారి వల్ల కలిగింది అని చెప్తారు, వారి మీద రాసిన కీర్తన ఇది, 

ఈ కలియుగంలో దారులన్నీ పాడైపోతూ ఉంటే వారే ఒక దారై చూపిన మహా గురువులు రామానుజులు అంటారు. 

ఈతని కరుణనేకా ఇలవైష్ణవుల మైతి
మీతని వల్లనే కంటి మీ తిరుమణి
ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము
ఈతడే రామానుజులు ఇహపర దైవము

వారి వలన మనం విష్ణుభక్తులమైనాము, వారి వలన వైకుంఠ మణి చూడగలిగాం, వారివల్లనే మనం నారాయణ అష్టాక్షరీ మంత్రము పలుకగలిగాం, ఆయినే రామానుజులు ఈ భూతలంమీద నడిచే దైవం అంటున్నారు. 


వెలయించె నీతడేకా వేదపు రహస్యములు
చలిమి నీతడే చూపె శరణాగతి
నిలిపినాడీతడే కా నిజముద్రా ధారణము
మలసి రామానుజులు మాటలాడే దైవము


వేదాలలోని సంక్లిష్ట రహాస్యాలను మనకు వివరించారు, శరణాగతి మార్గాన్ని మనకు చెలిమితో చూపారు, శంఖచక్ర (నిజముద్రధారణ) ధరియించినవాడు. నిజానికి రామానుజులు మనతో మాట్లాడే దైవము అంటారు అన్నమయ్య. 

స్వామిని చేరేందుకు నియమాలని పెట్టనివారు, మనకి మోక్షమార్గాన్ని ప్రసాదించి, ఆ వేంకటేశ్వర స్వామి కి చేరువైన మనకి తల్లి తండ్రిలా దయచూపిన వారు అంటారు అన్నమయ్య 

నియమములు ఈతడేకా నిలిపె ప్రపన్నులకు
దయతో మోక్షము చూపె తగనీతడు
నయమై శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను
దయచూచి మమ్మునిట్టే తల్లిదండ్రి

 


Saturday, September 12, 2020

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు

           జై శ్రీమన్నారాయణ 


సంపుటి 3, సంకీర్తన 577 

రాగం : కురంజి 

పాడినవిధానం : బాలకృష్ణ ప్రసాద్ గారు 


            ముద్దులొలుకు బాలకృష్ణడు యశోదమ్మ ముంగిటి ముత్యమైనాడు ఈ దేవకీసుతుడి మహిమలు తిరుగులేనివి కదా! అంటూ నందనందనుడి విలాసాలను నవరత్నాలతో సరిపోల్చుతున్నారు అన్నమాచార్యుల వారు. 


దిద్దరాని = తిరుగులేని (వంకలు పెట్టుటకు వీలులేని) సతమై = శాశ్వతమై, పంటమాడే = ఎదురుతిరిగిన, కాంతుల = కాంతులుకల, పాలజనిధి = పాలసముద్రము, పద్మనాభుడు = పద్మము నాభియందు కలవాడు (మహావిష్ణువు) 



           ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
           తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంత మాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు

 

Wednesday, September 2, 2020

బ్రహ్మ కడిగిన పాదము

 జై శ్రీమన్నారాయణ 

రాగం : ముఖారి 

సంపుటి : 1, సంకీర్తన : 191

పాడిన విధానం : శ్రీమాన్ బాలసుబ్రమణ్యం 

స్వరకల్పన : రమేష్ నాయుడు గారు 


బ్రహ్మ కడిగిన పాదము 

బ్రహ్మము తానె నీ పాదము 


చెలఁగి వసుధ గొలిచిన నీ పాదము 

బలితల మోపిన పాదము 

తలకక గగనము తన్నిన పాదము 

బలరిపు గాచిన పాదము 


కామిని పాపము కడిగిన పాదము 

పాము తలనిడిన పాదము 

ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము 

పామిడి తురగపు పాదము 


పరమయోగులకు పరిపరి విధముల 

వర మొసగెడి నీ పాదము 

తిరువేంకటగిరి తిరమని చూపిన 

పరమపదము నీ పాదము 


త్రివిక్రమాకృతి (వామనావతారంలో) దాల్చినపుడు స్వామీ వారి పాదం బ్రహ్మలోకానికి వ్యాపించినదిట! అప్పుడు బ్రాహాముదేవుడు స్వామీ పాదాన్ని అభిషేకిస్తాడు! అందుకే అన్నమయ్య బ్రహ్మకడిగిన పాదము అని అంటున్నాడు. అట్టి ఈ పాదము సకలలోకాలకు పరబ్రహ్మమైనది! ఈ పాదం వసుధనే కొలిచినది! బలి తలను పాతాళానికి త్రొక్కినది! ఆకాశాన్నింటినది! అహల్య పాపాన్ని  ప్రక్షాళన చేసినది! కాళిందునిపై నాట్యమాడినది! ప్రేమతో శ్రీసతి చేత ఆరాధింపబడేది! కల్క్యావతారంలో గుర్రాన్ని అధిరోహించేది! పరమయోగులకు అనేక విధాలుగా ముక్తిని అనుగ్రహించేది! అట్టి ఈ పాదము కలియుగంలో వేంకటాద్రి పై కొలువైనది! పరమపదాన్ని అందించే ఈ పాదాన్ని ఆశ్రయిద్దాం! ధన్యులమవుదాం!! 


Friday, August 28, 2020

ఆడరో పాడరో అప్సరోగణము

 జై శ్రీమన్నారాయణ 

పాడినవిధానం : శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 
సంపుటి: 22, సంఖ్య: 96, పుట: 65 (83), రేకు: 1216-6
సంపుటిలో రాగం: మంగళకౌసిక

ఓ దేవతా గణం దివిలో అతి పవిత్రమైన వివాహం జరుగుతోంది ఆడుతూ పాడుతూ రండి తాంబూలం తీసుకోవడానికి అంటూ పిలుస్తున్నారు అన్నమయ్య ఆ శ్రీవేంకటనాధుని అలమేల్మంగమ్మ కళ్యాణానికి, చక్కటి ఈ పెళ్ళి పాటలో. 

 


ఆడరో పాడరో అప్సరోగణము

ఆడరో పాడరో అప్సరోగణము

వీడెము లిందరో విభవము నేడు

వీడెము లిందరో విభవము నేడు

ఆడరో పాడరో అప్సరోగణము

వీడెము లిందరో విభవము నేడు

ఆడరో పాడరో అప్సరోగణము

ఆడరో పాడరో అప్సరోగణము


 

ఆ శ్రీవెంటకటేశాలమేల్మంగల కళ్యాణ ప్రారంభానికి శుభసూచకంగా గరుడధ్వజాన్ని (జెండా) ఎగురవేశారట, సంగీత వాయిద్యాలు బాగా వాయించబడుతున్నాయాట, ఓ దివినున్న దేవతలారా ఈ దృశ్యాన్ని చూడడానికి తరలిరండి అంటున్నారు. 


 

కమలారమణుని కళ్యాణమునకు

తమినదె గరుడుధ్వజ మెసగె

కమలారమణుని కళ్యాణమునకు

తమినదె గరుడుధ్వజ మెసగె

తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు

గమనించరో దివిగల దేవతలు

తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు

గమనించరో దివిగల దేవతలు

ఆడరో పాడరో అప్సరోగణము

వీడెము లిందరో విభవము నేడు

ఆడరో పాడరో అప్సరోగణము

ఆడరో పాడరో అప్సరోగణము


ఆ దివ్య కళ్యాణ మోహత్సవానికి అంకురార్పణ జరుగుతోంది, చందనం, అక్షతలు తీసుకోండి ఓ శ్రీవైష్ణవులారా (విష్ణుభక్తులు) అంటున్నారు అన్నమయ్య 


 

 

వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని

బలసి అంకురార్పణ మదివో

వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని

బలసి అంకురార్పణ మదివో

కలగొన నిచ్చేరు గంధాక్షతలవె

చెలగి కైకొనరో శ్రీవైష్ణవులు

కలగొన నిచ్చేరు గంధాక్షతలవె

చెలగి కైకొనరో శ్రీవైష్ణవులు

ఆడరో పాడరో అప్సరోగణము

వీడెము లిందరో విభవము నేడు

ఆడరో పాడరో అప్సరోగణము

ఆడరో పాడరో అప్సరోగణము


 

అదిగో అతి ముఖ్యమైన ఘట్టం తలంబ్రాలు పోసుకుంటున్నారు, ఆ రంగుల దృశ్యం చూడండి ఎంత ముచ్చటగా ఉందొ, ఓ భక్తులారా మీ కానుకలను ఆ అలమేల్మంగాశ్రీవేంకటపతులకు అందించండి అంటున్నారు అన్నమయ్య. 


 

బడి శ్రీ వేంకటపతికి శ్రీసతికి

అడరిన తలబాలందె నిదె

బడి శ్రీ వేంకటపతికి శ్రీసతికి

అడరిన తలబాలందె నిదె

నడచి పరుషలు నానా ముఖముల

ముడుపులు చదువరో ముయిగా నరులు

నడచి పరుషలు నానా ముఖముల

ముడుపులు చదువరో ముయిగా నరులు

ఆడరో పాడరో అప్సరోగణము

వీడెము లిందరో విభవము నేడు

ఆడరో పాడరో అప్సరోగణము

వీడెము లిందరో విభవము నేడు

ఆడరో పాడరో అప్సరోగణము

ఆడరో పాడరో అప్సరోగణము

ఆడరో పాడరో అప్సరోగణము

అప్సరోగణము

అప్సరోగణము


 



Tuesday, August 25, 2020

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

 జై శ్రీమన్నారాయణ 

సంపుటి 2, సంకీర్తన 438

రాగం : శుద్ధసావేరీ 

పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు 


భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల

దీమసాన మోచేటిదేవుఁడ నేను

భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల

దీమసాన మోచేటిదేవుఁడ నేను

కామించి సస్యములు కలిగించి చంద్రుఁడనై

తేమల పండించేటిదేవుడ  నేను

కామించి సస్యములు కలిగించి చంద్రుఁడనై

తేమల పండించేటిదేవుడ  నేను

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

విని ఆతని భజించు వివేకమా

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

 

 

 

దీపనాగ్నినై జీవదేహముల అన్నములు

తీపుల ఆరగించేటిదేవుఁడ నేను

దీపనాగ్నినై జీవదేహముల అన్నములు

తీపుల ఆరగించేటిదేవుఁడ నేను

యేపున నిందరిలోనిహృదయములోన నుందు

యేపున నిందరిలోనిహృదయములోన నుందు

దీపింతుఁ తలఁపుమరపై దేవుఁడ నేను

యేపున నిందరిలోనిహృదయములోన నుందు

దీపింతుఁ తలఁపుమరపై దేవుఁడ నేను

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

విని ఆతని భజించు వివేకమా

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

 

 

 

వేదములన్నిటిచేతా వేదాంతవేత్తలచే

ఆది నే నెరఁగఁదగినయాదేవుఁడను

వేదములన్నిటిచేతా వేదాంతవేత్తలచే

ఆది నే నెరఁగఁదగినయాదేవుఁడను

శ్రీదేవితోఁ గూడి శ్రీవేంకటాద్రిమీఁద

శ్రీదేవితోఁ గూడి శ్రీవేంకటాద్రిమీఁద

పాదైనదేవుడఁను భావించ నేను

శ్రీదేవితోఁ గూడి శ్రీవేంకటాద్రిమీఁద

పాదైనదేవుడఁను భావించ నేను

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

విని ఆతని భజించు వివేకమా

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

విని ఆతని భజించు వివేకమా

అని ఆనతతిచ్చె కృష్ణుడర్జునునితో

 

 

 భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునునకు ఇచ్చిన ఉపదేశాన్ని మన అన్నమయ్య అచ్చ తెలుగులో అందంగా ఈ పాటలో అందించారు! శ్రీ కృష్ణుడు అర్జునునితో ఇల్లా అంటున్నాడు " నేను భూమిలో ప్రవేశించి చైతన్య శక్తితో సకల ప్రాణులను ధరించు దేవుడను! చంద్రుని రూపంలో నెలవై రసములు నింపి ఓషదులను వృద్ధి చేసి పండించు దేవుడను! సకల జీవుల దేహాలలో జఠరాగ్నినై ఆహారాన్ని జీర్ణం చేసే దేవుడను! అందరి హృదయాలలో సర్వాంతర్యామిగా కోలువైన దేవుడను నేను! మరపు (మాయ), జ్ఙాపకము (తెలివి) రూపంలో ఉన్న దేవుడను నేను! సకల వేదాల చేత, వేదాంతవేత్తల చేత మొదటి తెలియదగిన దేవుడను నేను! అట్టి నేనెను కలియుగంలో శ్రీ మహాలక్ష్మితో కూడి శ్రీ వెంకటాద్రిపై స్థిర నివాసమేర్పరచుకున్నాను" ఇప్పుడు అన్నమయ్య మన బుద్ధికి జ్ఙానబోధ చేస్తున్నాడిలా, "ఓ వివేకమా! ఇది విని ఆ దేవుని కీర్తించుము" మరి అన్నమయ్య పాటతోనే ఆ వేంకటేశ్వరుడిని కీర్తించుదామా!  


భజించు = కీర్తించు

దిమసాన = ధైర్యముతో , ఓజోబలముతో  

దీపానాగ్ని = జఠరాగ్ని (వైశ్వానరము) 

ఆది = మొదలు 

పాదైనా = నెలకొన్న 


Thursday, August 20, 2020

చదివి బ్రతుకరో సర్వజనులు మీరు

జై శ్రీమన్నారాయణ 

రాగం : మాధ్యమావతి 

పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు 

సంపుటి : 4, సంకీర్తన 33. 

 

" ఓం నమో నారాయణాయ"  శ్రీ  మన్నారాయణుని అష్టాక్షరీ మంత్రం రాజమిది! సర్వ పాపాలను పరిహరించి, ముక్తి మార్గాన్ని అందరికీ సులభంగా అందించేది! కుల మత వర్గ వర్ణ అధిక నిమ్న భేదాలతో పట్టింపు లేకుండా ఈ మంత్ర పఠనకు భక్తి గల వారందరూ అర్హులే! అందుకే అన్నమయ్య సర్వజనులు అంటున్నారు. అంతేకాకుండా కొన్నారో కొన్నారో పాటలో వలే ఈ మంత్రరాజాన్నిపఠించి ఎవరెవరు  తరించారో చాలా చక్కగా అర్ధ వివరణ అవసరం లేకుండా అన్నమయ్య చెబుతున్నారు! కాబట్టి మనమంతా 'నారాయణాష్టాక్షరీ' మంత్రాన్ని చదివి బ్రతుకుదాం! జీవితాలను సార్ధకం చేసుకుందాం! 

 

కదిసి = సమీపించి 

గాదిలి = ప్రేమము 

వెతదీర  = దుఃఖము (బాధ) తొలగిపోవునట్లు 

జతనము = ప్రయత్నము 

గతి = మార్గము 

వెలయ = ప్రాకాశించునట్లు 

 


 

చదివి బతుకరో సర్వజనులు మీరు 
కదిసి నారాయణాష్టాక్షర మిదియే ||

సాధించి మున్నుశుకుడు చదివినట్టిచదువు 
వేదవ్యాసులు చదివిన చదువు |
ఆదికాలపు వైష్ణవులందరి నోటి చదువు
గాదిలి నారాయణాష్టాక్షర మిదియే ||

సతతము మునులెల్ల చదివినట్టిచదువు 
వెతదీర బ్రహ్మ చదివిన చదువు |
జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు 
గతిగా నారాయణాష్టాక్షర మిదియే  ||

చలపట్టి దేవతులు చదివినట్టిచదువు 
వెలయ విప్రులు చదివేటి చదువు |
పలుమారు శ్రీ వేంకటపతి నామమై భువి 
కలుగు నారాయణాష్టాక్షర మిదియే  ||


Tuesday, August 4, 2020

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా

జై శ్రీమన్నారాయణ 



సిన్నెక్కా…..

సిన్నెక్కా…..

సిన్నెక్కా…….


విష్ణుమూర్తి దశావతారాలను జానపదశైలిలో హృద్యంగా పాడారు అన్నమయ్య, సిరుతనవ్వు అంటే చిరునవ్వు "సిన్నక్క! వీడు చిరునవ్వులు చిందిస్తున్నాడు, వీడికి భయమేలేదు చూడవే" అంటోది  పల్లెపడుచు సిన్నక్కతో. 


 

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

వెరపెరుగడు సూడవే

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

వెరపెరుగడు సూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా

సిన్నెక్కా…..

సిన్నెక్కా…….

 

Uploaded by @padmacharan

 

పొలుసులు చెపకుంటాయి, పోలిసుల మేనున్నవాడు ఎవరు? మశ్చ్యవతారం. బోరవీపున్నవాడు ఎవరు? కూర్మావతారం. సెలసు అనగా వరాహారం మోర అంటే ముఖం వరాహముఖమున్న వాడేవారు? వరాహవాతారం. గొలుసుల వంటి వంకరలున్న కోరలున్నవాడు ఎవరు? నరసింహావతారం. 

Uploaded by @padmacharan


పొలసు మేనివాడు బోరవీపు వాడు

పొలసు మేనివాడు బోరవీపు వాడు  

సెలసు మోరవాడు సిన్నెక్కా

పొలసు మేనివాడు బోరవీపు వాడు

సెలసు మోరవాడు సిన్నెక్కా

కొలుసుల వంకల కోరలతోబూమి వెలసినాడు సూడవే

కొలుసుల వంకల కోరలతోబూమి వెలసినాడు సూడవే సిన్నెక్కా

కొలుసుల వంకల కోరలతోబూమి వెలసినాడు సూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

వెరపెరుగడు సూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా

 

Uploaded by @padmacharan

గట్టి పొట్టివాడెవరు? వామనావతారం. మెడమీద గొడ్డలి మోపుకున్న వాడేవారు? పరశురామావతారం. సీటకాలవాడు? నాగలిబట్టి దున్నుతున్నప్పుడు భూమిపైనా ఒక గీత ఏర్పడుతూ వస్తుంది ఆ గీతను "సీతకము" అంటారు, కాలక్రమేపి "సీటకము" గా మారింది. ఈ సీటకాలు వేసేవాడే - బలరామావతారం. తన స్త్రీని బాసి అడవిలో రాక్షసునితో యుద్ధం చేసినవాడెవరు? రామావతారం. 

 Uploaded by @padmacharan



మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెక్కా

మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి సీటకాలవాడు సిన్నెక్కా

ఆటదానిబాసి ఆడవిలో రాకాశి వేటలాడీ జూడవే

ఆటదానిబాసి ఆడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెక్కా

ఆటదానిబాసి ఆడవిలో రాకాశి వేటలాడీ జూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

వెరపెరుగడు సూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా

 

Uploaded by @padmacharan

 

 

పిల్లనగ్రోవిపైన బింకంగా రాగాలు పలికించే జింకచూపుల వాడేవారు? కృష్ణావతారం. 

భయపడకుండా  కల్కి  అవతారమై సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడు నన్ను కూడుకున్నాడు చూడవే సిన్నక్కా అంటూ దశావతారాల పొడుపుకథలను వేసిన అన్నమయ్య చివరి అవతారాన్ని పేర్కొనేశాడు. 


Uploaded by @padmacharan


 

బింకపు మోతల పిల్లగోవి వాడు

సింక సూపులవాడు సిన్నెక్కా

బింకపు మోతల పిల్లగోవి వాడు

సింక సూపులవాడు సిన్నెక్కా

కొంకక కలికియై కొసరి కూడె నన్ను

వేంకటేశుడు సూడవే

కొంకక కలికియై కొసరి కూడె నన్ను

వేంకటేశుడు సూడవే సిన్నెక్కా

కొంకక కలికియై కొసరి కూడె నన్ను

వేంకటేశుడు సూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

వెరపెరుగడు సూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా వీడు

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా

సిన్నెక్కా…..

సిన్నెక్కా…….

సిన్నెక్కా…….

 

Uploaded by @padmacharan