Monday, October 5, 2020

ఏడ వలపేట మచ్చి కేడ సుద్దులు

 జై శ్రీమన్నారాయణ 

రాగం : రేవతి 

సంపుటి : 1, సంకీర్తన : 220 

పాడినవిధానాం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ 


ఏడ వలపేట మచ్చి కేడ సుద్దులు 

ఆడుకొన్నమాటలెల్ల నవి నిజాలా 


తొలుకారు మెఱుపులు తోచి పోవుగాక 

నెలకొని మింటి నవి నిలిచీనా 

పొలతులవలపులు పోలసిపోవుగాక 

కలకాలంబవి కడతేరీనా 


కలలోని సిరులెల్ల కనుకూర్కులేకాక 

మెలకువ చూడ నవి మెరసీనా 

అలివేణుల మేలు ఆసపాటేకాక 

తలపు వేంకటపతి తగిలీనా 


కాంతాకనకాదులు అనాదిగా జీవుణ్ణి మాయామోహితుణ్ణి చేసి అధోగతి పాలు చేస్తున్నాయి. ఇవన్నీ అసత్యాలు! అశాశ్వతాలు! అదే విషయాన్నీ అన్నమయ్య ఈ పాటలో చక్కగా తెలియజేస్తుననాడు! మనం ప్రేమ, వలపు ఆత్మీయత, అనుకునే ఇవన్నీ నిజంగా నిజమైనవా? కాదు, ఎందుకంటే అనంత కాలగమనంలో ఎవరూ ఎవరినీ శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండరు. చనిపోయేటప్పుడు ఏకాకిగా పోవాల్సిందే! కాబట్టి మూన్నాళ్ళ ముచ్చట అయన ఈ భోలోకంలో ఉన్న బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు అంత వట్టి బూటకాలే కదా! తొలకరి మెరుపులు, ఉరుములు అలా వచ్చి ఒక్కసారిగా గర్జించి వెళ్లిపోతాయి తప్ప వాటివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు! అలాగే భామినులు వలపులు కూడా యవ్వనంలో మురిపించి సత్యాన్ని మరపించేవే తప్ప శాశ్వతాలు కావు! దూరం నుంచి చూస్తే ఎండమావులలో నీరు ఏరులై పారుతుంది కానీ దగ్గరకు వెళ్లి దాహం తీర్చుకుందామనుకుంటే ప్రయోజనం శూన్యం! ఆ విధంగానే నెలతలపై మోహము ఆశకొల్పుతుంది కానీ శాశ్వతానందాన్ని అందివ్వదు! కలలో  కనిపించిన సంపద ఎలా మన చేతికి అందదో, అలాగే కాంతలపై మొహం వల్ల  మేలు చేతికి అందదు సరికదా, అది భగవంతునిపై తలుపును చేర్చనివ్వదు. 



శరణంటి మాతని సంబంధమునజేసి

 జై శ్రీమన్నారాయణ 

రాగం : లలిత 

సంపుటి 2, సంకీర్తన 24

రాసిన వారు : శ్రీ పెద్ద తిరుమలాచార్య 

పాడినవిధానము : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు 


శరణంటి మాతని సంబంధమునజేసి 

మరిగించి మమునేలి మన్నించవే 


సకల వేదములు సంకీర్తనలు చేసి 

ప్రకటించి నినుపాడి పావనుడైన 

అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యులు 

వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ 


నారదాది సనక సనందనాదులవలె 

పేరుబడి నిన్నుపాడి పెద్దలైనట్టి 

ఆ రీతి తాళ్ళపాక అన్నమాచార్యుల 

చేరి ఏలినయట్టి శ్రీ వేంకటనిలయ 


సామవేద సామగాన సప్తస్వరములను 

బాముతో నీసతి నిన్ను పాడినయట్టి 

ఆముకొన్న తాళ్ళపాక అన్నమాచార్యుల 

వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయ 


పెద్ద తిరుమలాచార్యుల వారి సంకీర్తన ఇది, అన్నమయ్య వంశస్థులమై, ఆ మహనీయునితో గల అనుబంధంతో మిమ్ముల్ని శరణు కోరుతున్నాను స్వామీ! సకల వేదసారాన్ని సంకీర్తనలుగా మలచి, నారదసనక సనందనాదుల వలె నీపై సంకీర్తనలు పాడి, సామవేద సామగాన సప్తస్వరములను నీకంకితం చేసిన అన్నమయ్యను చూసైనా మమ్ముల్ని కరుణించు వేంకటనిలయా! అంటూ విన్నపం చేస్తున్నాడు పెద్దతిరుమలయ్య . 

చాటెద నిదియే సత్యము సుండో

 జై శ్రీమన్నారాయణ 

రాగం : శుద్థసావేరి 

సంపుటి 2, సంకీర్తన 164

పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ 



చాటెద నిదియే సత్యము సుండో 

చేటులే దితని సేవించినను 


హారినొల్లని వా రసురులు సుండో 

సురలీతని దాసులు సుండో 

పరమాత్ముడితడే ప్రాణము సుండో 

మరుగక మరచిన మరి లేదికను 


వేదరక్షకుడు విష్ణుడు సుండో 

సోదించె  శుకుడు అచ్చుగ సుండో 

ఆది బ్రహ్మగన్నాతడు సుండో 

ఏదెస వెదకిన ఇతడే ఘనుడు 


ఇహ పర మొసగను ఈతడే సుండో 

వహి నుతించె పార్వతి సుండో 

రహస్య మిదియే రహి శ్రీ వేంకట 

మహీధరంబున మనికై నిలిచె 


అన్నమయ్య శ్రీ వేంకటాద్రిని  అధిరోహించి తాను కనుగొన్న సత్యాన్ని లోకానికంతటికీ ఎలుగెత్తి చాటుతున్నాడు! రెండు చేతులతో మనలందర్ని ఆ కొండపైకి ఆహ్వానిస్తూ ఇదిగో వినండి ఇదియే సత్యము కలియుగ రహస్యాన్ని మీ అందరికీ వెల్లడి చేస్తున్నాను, వేదరక్షకుడైన విష్ణుదేవుడు మనందరికీ ప్రాణాధారుడు ఇహపరాలను అనుగ్రహించేవాడు కలియుగంలో శ్రీ వేంకటాద్రిపై మనకు మనుగడగా  నిలిచి ఉన్నాడు కాబట్టి రండి ఆ దేవుని సేవించండి తరించండి అంటున్నాడు అన్నమయ్య ఆశ్రితజనపాలకుడు , సత్యస్వరూపుడైన శ్రీ వేంకటేశ్వరుణ్ని సేవించి తరిద్దాం